యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌‌ను అరెస్ట్ చేయడానికి కారణం ఇదే..!

చట్టాలకు పదును పెట్టారు ఏపీ పోలీసులు. గడిచిన రెండేళ్లుగా సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు పదేపదే చెబుతున్నారు. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చెప్పినా ఏ మాత్రం వినలేదు. ఫలితంగా అరెస్టుల పర్వం మొదలైంది. తాజాగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌ను పిఠాపురం పోలీసులు చేశారు.

 

పిఠాపరం పోలీసులకు చిక్కిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌

 

సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నవారిపై ఫోకస్ చేశారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ రావణ్‌ను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి ఆయన్ని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.

 

రాత్రి పిఠాపురంలో మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. పూచీకత్తుపై రావణ్‌కు బెయిల్‌ మంజూరు చేశారు. మరో కేసులో వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూన్ 29న అసలేం జరిగింది? ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, రాధా మనోహర్ మీద యూట్యూబర్ రావణ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

 

ఏలూరు సభలో సీఎం, డిప్యూటీ సీఎంలపై అనుచిత వ్యాఖ్యలు

 

తాను నాస్తికుడిని.. ఏ దేవుళ్లను నమ్మనని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రావణ్. తనకు ఏ దేవుడు లేదని, ఏ మతాన్ని నమ్మనని మనసులోని మాట బయటపెట్టాడు. సరిగ్గా జూన్ 29న ఏలూరు క్రైస్తవ సభలో కీలక వ్యాఖ్యలు చేశాడు. దేశంలో రాముడు, కృష్టుడ్ని గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని అన్నాడు. మిగతా దేవుళ్ల గురించి మాట్లాడితే ఏ ఒక్కరూ నోరు విప్పరన్నాడు.

 

రావణ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చారు. ఏ మతానితో సంబంధం లేదన్న రావణ్, కైస్త్రవ సభలో ప్రసంగించడం వెనుక పనేంటని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దిక్కుమాలిన ప్రభుత్వమంటూ ఆరోపించారు. 2029 ఏడాది గుర్తు పెట్టుకోవాలన్నాడు.

 

దీనిపై జనసేన కార్యకర్త బొజ్జకుమార్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. వ్యక్తులతోపాటు కులాలను రెచ్చగొట్టేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, మంగళవారం రాత్రి రావణ్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. అక్కడి నుంచి పిఠాపురానికి రావణ్‌ను తరలించారు. పిఠాపురం పోలీసు స్టేషన్ లో పెద్దాపురం-పిఠాపురం పోలీసులు అతడ్ని విచారించారు.

 

ఈ ప్రభుత్వం తనకు నచ్చలేదన్న కారణంతో విమర్శలు చేసినట్టు చెప్పాడట. ఆయన బ్యాంకు అకౌంట్లను పరిశీలించారు. తనకు కేవలం యూట్యూబ్ ద్వారా ఆదాయం వస్తుందని తెలిపినట్టు సమాచారం. అనంతరం ప్రభుత్వం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ, క్రైస్తవ దళిత సంఘాల నేతలు స్టేషన్‌ కు వచ్చారు. అటు జనసేన నేతలు పెద్దఎత్తున స్టేషన్‌కు చేరుకున్నారు.

 

పవన్‌పై విమర్శలు చేసిన రావణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో ఇరువర్గాలను చెదరగొట్టారు పోలీసులు. రాత్రి 9.30 గంటల సమయంలో పిఠాపురంలో మేజిస్ట్రేట్‌ వద్ద రావణ్‌ను హాజరుపరిచారు. రెండున్నర గంటల వాదనల అనంతరం అతడికి బెయిల్‌ మంజూరు చేశారు. వెంటనే 2025లో నమోదైన మరో కేసులో రావణ్‌ను కాకినాడ సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.