తేది:26-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా నూతన కలెక్టర్గా నియమితులైన ప్రతిమా సింగ్ ఐఏఎస్ గారు గురువారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.కలెక్టరేట్కు చేరుకున్న ఆమెకు అదనపు కలెక్టర్ నగేష్, డి.ఆర్.ఓ భుజంగరావు, ఆర్డీవో రమాదేవి మరియు ఇతర జిల్లా అధికారులు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో అధికారిక పత్రాలపై సంతకాలు చేసి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రతిమా సింగ్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి పౌరునికి చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆలస్యం ఉండకూడదని సూచించారు.
ఇంటర్ మరియు పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై డీఈఓ మరియు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలు, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం—ఇవే తన ప్రాధాన్యతలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి.ఆర్.ఓ భుజంగరావు తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.