ప్రజాకవి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు ఘన నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణ గడ్డ గర్వించదగ్గ కలం యోధుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.
“ఒక్క సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి, పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ” అని కవిత తన పోస్టులో పేర్కొన్నారు. అణచివేత, అన్యాయం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా దానిని ధైర్యంగా ఎదిరించిన తత్వం ఆయనదని ప్రశంసించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ విముక్తి కోసం కాళోజీ చేసిన పోరాటాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సామాన్య ప్రజల భాష, యాసలోనే వారి సమస్యలపై గళం విప్పి, తెలంగాణ విముక్తి కోసం నిరంతరం తపించిన మహనీయుడు కాళోజీ అని కవిత స్మరించుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కాళోజీ అందించిన స్ఫూర్తిని పలువురు ప్రముఖులు ఆయన వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకున్నారు.