తెలంగాణ బడ్జెట్ బీజేపీ నేతలపై పెద్ద పిడుగే..!.

తెలంగాణలో రాబోయే ఎన్నికలలో గెలిచేది తామేనని..తమ బలం పెరిగిందని భావిస్తున్న బీజేపీ పార్టీ శ్రేణులకు నిన్నటి బడ్జెట్ కేటాయింపులతో ఉన్న ఆశలన్నీ ఆవిరయ్యేలా కనిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలలో అనూహ్యంగా బలం పుంజుకున్న బీజేపీ రాష్ట్రంలో పోటీచేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ధీటుగా ఎనిమిది ఎంపీ సీట్లు దక్కించుకుంది. అసెంబ్లీలోనూ గతానికి భిన్నంగా ఎనిమిది స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఇక తెలంగాణలో పాగా వేద్దాం అని భావిస్తున్న తరుణంలో అనుకోని విధంగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో తెలంగాణ బీజేపీ నేతలపై పెద్ద పిడుగే పడింది. బడ్జెట్ కేటాయింపులలో తెలంగాణకు మొండి చెయ్యి చూపిన మోదీ వైఖరి పార్టీలో చర్చనీయాంశం అయింది. ఇప్పుడు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నేతలు కలిసి తెలంగాణ బీజేపీని చెడుగుడు ఆడేసుకుంలున్నారు.

 

విపక్షాల దాడులు

 

ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం చెయ్యలేకపోయారని విపక్షాలు దాడులు చేస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి ఏం ప్రయోజనం అని బాహాటంగానే చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకే మోదీ న్యాయం చేస్తున్నారని ..మిగతా రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని వస్తున్న విమర్శలు మరో సారి నిజం అయ్యాయి. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా తెలంగాణపై గత ఎన్నికలలో మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు దృష్టిపెట్టారు. బీజేపీని గెలిపిస్తే తెలంగాణకు అవి చేస్తాం..ఇవి చేస్తాం అని స్థాయికి మించిన ప్రచారం చేశారు. అవి నమ్మే తెలంగాణ ఓటర్లు బీజేపీకి గంపగుత్తగా ఓట్లేశారు. తీరా బడ్జెట్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఈ సారీ మొండి చెయ్యి ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది ఎంపీలు ఎలాగైనా ఒత్తిడి తెచ్చి కొద్దో గొప్పో నిధులు తెస్తారని అనుకుంటే ..వారితో కష్టమే అని సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ప్రజలలో బీజేపీ ఎంపీలపై నెగెటివ్ భావన వెళ్లిపోయిందని తలలు పట్టుకుంటున్నారు. తమ కష్టాలను చెప్పుకోవడానికి కనీసం తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు సైతం లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.

 

‘లోకల్’ ఎన్నికలలో ఎలా?

 

త్వరలోనే స్థానిక ఎన్నికలు జరిపించేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు మరోసారి ప్రచారం కోసం ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలి. ఎక్కడికక్కడ బీజేపీ ఎంపీలను నియోజకవర్గాలలో ప్రజలు నిలదీస్తారేమో అనే భయం పట్టుకుంది. పైగా అసెంబ్లీ సమావేశాలలో అధికార పక్షం, బీఆర్ఎస్ నేతలు బడ్జెట్ పై రాష్ట్రానికి అన్యాయం జరిగిన తీరుపై బీజేపీపై విరుచుకుపడుతున్నారు. దీనిని రాష్ట్ర ప్రజానీకం అంతటా గమనిస్తోంది. బీజేపీ విధానాలపై పోరాటానికి సిద్ధపడుతున్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే దక్షిణాది వివక్షపై సౌత్ సీఎంలందనినీ ఏకంచేసే ఏర్పాటు జరుగుతోందని సమాచారం. అదేగానీ జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీకి ముందు ముందు అధికారం లోకి రావడం కూడా కష్టంగా మారేలా ఉంది. కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకే తెలంగాణ బడ్జెట్ ను కేంద్ర బడ్జెట్ కేటాయింపుల తర్వాతే ప్రవేశపెట్టాలని భావించారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులు తెలంగాణకు ఏ మాత్రం ఉపయోగపడవు.

 

రేవంత్ సర్కార్ కు అస్త్రాలు

 

కేంద్రం బడ్జెట్ కేటాయింపులు లేకుండా చేసి రేవంత్ రెడ్డి చేతికి అస్త్రాలను ఇచ్చినట్లయింది. తెలంగాణ అభివృద్ధి చెందకపోవడానికి కేంద్రం సహకారం లేకపోవడమే అని రేపు కాంగ్రెస్ ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. అప్పుడు రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమానికి ఏం చెయ్యడంలేదని బీజేపీ శ్రేణులు విమర్శించే హక్కు కోల్పోతారు. లోకల్ గా తాము అన్ని విధాలుగా నష్టపోతామని బీజేపీ ఎంపీలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాగైతే ఎలా అని బీజేపీ అగ్రనేతలను అడిగేందుకు సిద్ధపడుతున్నారు. తాము ఎంపీలుగా ఉండి రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతే రాబోయే రోజుల్లో తమని ప్రజలే రాజీనామాలు చేయమని డిమాండ్ చేసే పరిస్థితి రావచ్చు..తమ ఇంటి ముందు ప్రజాందోళనలు జరిగే అవకాశం సైతం లేకపోలేదు. ఈ విషయంలో కేంద్రంతో సన్నిహిత సంబధాలు ఉన్న కిసన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *