‘దక్షిణాది పట్ల బడ్జెట్‌లో వివక్ష.. కేంద్రంపై పోరాటానికి మిగతా రాష్ట్రాల సిఎంలతో కలిసి చర్యలు’..

బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపిందని ఆరోపిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం ఉమ్మడి వ్యూహం కోసం దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించినట్లు తెలిపారు.

 

మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఇప్పటికే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించానని.. ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కూడా తమతో చేతులు కలిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అన్ని దక్షిణ భారత రాష్ట్రాలు కలిసి కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

 

”దక్షిణాది రాష్ట్రాల ప్రజలను బిజేపీ కేవలం ఓట్ బ్యాంకులా మాత్రమే చూస్తోంది.. ఇది ఇలాగే కొనసాగితే.. కేంద్రం చూపుతున్న ఈ వివక్ష మరో ఉద్యమానికి దారి తీస్తోంది. బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష చూపించడమే కాకుండా.. అసల తెలంగాణ అనే పదం ఒక్కసారి కూడా బడ్జెట్ ప్రసంగంలో లేకపోవడం దారుణం,” అని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

 

తెలంగాణలో ఏ రంగానికి కూడా కేంద్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు, మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టం కేవలం ఏపీకి మాత్రమే వర్తిస్తుందా?.. తెలంగాణకు వర్తించదా?.. వికసిత్ భారత్ కలలు కనే ప్రధాని మోదీకి ఆ భారత్ లో తెలంగాణ ఉన్నట్లు కనిపించలేదా? అని ప్రశ్నించారు. కేవలం ఎన్డీయే కూటమిలో ఉన్న ఆంధ్ర, బిహార్ ప్రభుత్వాలకు మాత్రమే నిధులు కేటాయించారంటే.. ఇది వికసిత్ భారత్ బడ్జెట్ కాదు.. ఇది కుర్సీ బచావో బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.

 

బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ హక్కుల కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో నిరసన చేస్తారని. రాష్ట్రానికి జరిగిన అన్యాయం పట్ల తెలంగాణ బిజేపీ ఎంపీలు కూడా నిరసనల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ”కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో మార్పులు చేసి.. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు ప్రాజెక్ట్, హైద్రబాద్ మెట్రో విస్తరణ, మూసీ రివర్ ప్రాజెక్టులకు నిధుల కేటాయించాలి. లేకపోతే బిజేపీ.. తెలంగాణలో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది,” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

 

తెలంగాణ అసెంబ్లీ డిబేట్ లో కేసీఆర్ పాల్గొనాలి.. లేకపోతే..

కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో జరిగే డిబేట్ లో బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక వేళ కేసిఆర్ రాకపోతే.. బిజేపీలో బిఆర్ఎస్ విలీనం చేసేందుకు ఇరుపార్టీలమధ్య డీల్ జరిగినట్లు వస్తున్న సమాచారం నిజమేనని భావించాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *