ఏపీ రైతులకు భారీ శుభవార్త.. రైతులందరికీ పంట బీమా..!

ఏపీ రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతులందరికీ పంటల బీమా అమలు చేయనున్నట్లు పేర్కొన్నది. సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన వ్యవసాయంపై ప్రకృతి విపత్తుల ప్రభావం అనే అంశంపై మంత్రులు, అధికారుల సబ్ కమిటీ సమావేశమయ్యింది. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ పంటల బీమాను అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విపత్తు సమయాల్లో రైతులకు న్యాయం జరగాలంటూ సబ్ కమిటీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గత ప్రభుత్వంలో పంటల బీమా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారంటూ మంత్రులు పేర్కొన్నారు. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల తోపాటు టీడీపీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర ఉన్నారు.

 

ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ పనులకు సంబంధించి కేంద్రాన్ని నిధులు కోరినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన నిమ్మల.. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 12,157 కోట్ల నిధులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ప్రాజెక్టు పూర్తికి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కొత్త డాయాఫ్రమ్ వాల్ నిర్మించాలని కేంద్రం సూచించినట్లు ఆయన చెప్పారు. కేంద్రం సూచనల మేరకు ముందుకెళ్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *