ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి అనిత మరోసారి ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకే జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు. ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. ‘నాలుగు రాజకీయ హత్యల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపించారు. ఆయన వద్ద వివరాలు ఉంటే మాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేనప్పుడు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ప్రజలు ఇంకా మీ మాయ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా జగన్?
వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వేధించారు. మీ హయాంలో పెట్టిన కేసులపై బాధితులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ జగన్ అడుగుతున్నారు. అధికారం కోల్పోయిన నెలకే ఆయన మైండ్ పనిచేయట్లేదు’ అంటూ జగన్ పై అనిత మండిపడ్డారు.