సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభా పక్ష సమావేశం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరగనున్న తరుణంలో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అసెంబ్లీ భవనంలో టీడీఎల్పీ భేటీ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసమే రేపు సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అందరూ పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ సూచనలు చేసింది.

 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ భవనంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. 23వ తేదీన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును కూటమి ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

 

ఈ నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు పూర్తి కానుంది. దీంతో మరో మూడు నెలలకు ఓటాన్ అకౌంట్‌ను సభలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. అక్టోబర్ మాసంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

 

ఇదిలా ఉండగా ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతారా? లేదా? అనేది పెద్ద ప్రశ్నగా ఉన్నది. 24వ తేదీనే ఢిల్లీలో మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ ఆందోళనకు ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, హత్యల గురించి తెలియజేస్తామని వివరించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పటికి అయితే సస్పెన్స్‌గానే ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *