ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు..రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ ల పాత్ర..!.

ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్ ల పాత్ర ఉందని ఆయన అన్నారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశామని చెప్పారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారిపై చర్యలు తప్పవన్నారు. రైతులకు ఇవ్వాల్సిన రూ. 600 కోట్లు త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో గురువారం మంత్రి సమీక్ష నిర్వహించారు.

 

నిత్యావసర సరకులను రాయితీపై ప్రజలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం, కందిపప్పు పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. విజయవాడ ఏపీఐఐసీ కాలనీలోని రైతు బజారులో తొలి కౌంటర్ ను మంత్రి నాదెండ్ల ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తోపాటు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో సామాన్యులకు నిత్యావసర సరకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

 

ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా కూడా ప్రజల కష్టాలు తీర్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అన్నారు. హోల్ సేల్ దుకాణదారులు, రిటైల్ వర్తకులు సైతం 160 రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు, తక్కువ ధరకే బియ్యం అందించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలను కూడా రైతు బజార్లలో రాయితీపై పంపిణీ చేస్తామన్నారు. ఒక్కొక్కరికి కిలో కందిపప్పు, ఐదు కిలోల బియ్యం చొప్పున అందిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *