భారత్-చైనా సరిహద్దులో స్మగ్లింగ్..108 కిలోల బంగారం స్వాధీనం..!

భారత్-చైనా సరిహద్దులో ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. చొరబాటు దారుల నుంచి 108 కిలోల బంగారు కడ్డీలను పట్టుకున్నారు. అయితే సరిహద్దులో పెద్ద మొత్తంలో బంగారాన్ని పట్టుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. లడఖ్ సెక్టార్‌‌లో ఇద్దరు అనుమానితుల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

ఐటీబీపీ వివరాల ప్రకారం.. లడఖ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో సెరిగాప్లే ప్రాంతంలో ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు వెల్లడించారు. వారిని విచారించగా ఔషద మొక్కలను సేకరిస్తున్నట్లు చెప్పారని తెలిపారు. చొరబాటులకు, స్మగ్లింగ్‌లకు ఎక్కువగా అవకాశాలు ఉండటంతో వారి వద్ద ఉన్న బ్యాగ్‌లను తనిఖీ చేయగా 108 కేజీల బంగారం దొరికినట్లు తెలిపారు. అంతే కాకుండా వారి వద్ద ఓ బైనాక్యులర్, కొన్ని కత్తులు, చైనీస్ ఫుడ్, రెండు పోనీలు, మరో రెండు ఫోన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు మరో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

 

ఇద్దరు నిందితలు లడఖ్‌లోని హాన్లీ గ్రామానికి చెందిన టార్గే, చెరింగ్ చంబాగా పోలీసులు తెలిపారు. లడఖ్, శ్రీనగర్ సెక్టార్‌లో ముమ్మరంగా ఐటీబీపీ తనిఖీలు చేస్తుందని తెలిపారు. అనుమానిత వ్యక్తులు తప్పించుకునేందుకు యత్నించగా పెట్రోలింగ్ చేసి పట్టుకున్నామని అన్నారు. లడఖ్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతన్నామని వెల్లడించారు. అనుమానితులను కస్టమ్స్ విభాగానికి అప్పగించనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *