ఇంజినీర్లకు కాళేశ్వరం కమిటీ కీలక ఆదేశాలు..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. తదుపరి సాక్షాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చినటువంటి అఫిడవిట్లను విశ్లేషిస్తున్నారు. ఆ తరువాత అందులోని అంశాల ఆధారంగా నోటీసులు జారీ చేసి సాక్షాలు నమోదు చేయనున్నారు. అనంతరం బహిరంగ విచారణ ప్రక్రియ నిర్వహించనున్నారు.

 

విచారణ ప్రక్రియలో భాగంగా నేడు కమిషన్ ముందు పంప్ హౌస్ నిర్మాణ సంస్థలకు చెందిన 14 మంది ఇంజినీర్లు, అధికారులు హాజరయ్యారు. వారి నుంచి అవసరమైన వివరాలను, సమాచారం అడిగి తీసుకున్నారు. అదేవిధంగా వారిని కూడా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. అఫిడవిట్ల దాఖలుకు ఈ నెల 16 వరకు గడువు ఇచ్చారు. ఇటు పంప్ హౌస్ ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా కమిషన్ ముందు హాజరయ్యారు.

 

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో ఇచ్చిన నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) ఈ కమిషన్ కు అందజేసింది. అయితే, ఈ నివేదికను పరిశీలించిన తరువాత కాగ్ అధికారులను పిలిచి పూర్తి వివరాలను తీసుకునే ఆలోచనలో కమిషన్ ఉంది. కమిషన్ కు సహాయకారిగా ఉండేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కూడా మూడు ఆనకట్టలకు సంబంధించి తమ అధ్యయన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కు సమర్పించారు.

 

తుది నివేదిక కూడా ఇవ్వాలని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ, విజిలెన్స్ విభాగాన్ని కమిషన్ మరోసారి ఆదేశించింది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతోపాటు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన వివరాలన్నిటినీ తమకు అందజేయాలని కమిషన్ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *