ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
నిరుద్యోగుల ఆందోళనల దృష్ట్యా శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, సామ రామ్మోహన్రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ హర్షవర్ధన్రెడ్డి, ఓయూ విద్యార్థి నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్ష్మి, చారకొండ వెంకటేష్, కాల్వ సుజాత తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
కేవలం కొన్నిరాజకీయ పార్టీలు, స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మార్చితే తలెత్తే చట్ట పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని.. దానికి తగ్గట్టు తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
గత ప్రభుత్వం చేసినట్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా.. ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని అన్నారు సీఎం. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం తమ ప్రభుత్వం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టామని స్పష్టం చేశారు.
ఏళ్లకు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నియామకాలకు ఉన్న కోర్టు చిక్కులన్నీ అధిగమించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి, ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.