కేంద్రం కొత్త చట్టం, పేపర్ లీక్ చేస్తే..ఐదేళ్లు జైలు, కోటి జరిమానా..!

పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం మోదీ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఓ వైపు విద్యార్థులు .. మరోవైపు రాజకీయ నేతలు మోదీ సర్కార్ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కొత్త యాక్ట్‌ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం.

 

ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్-2024ను అమల్లోకి తెచ్చింది. జూన్ 21 అంటే (శుక్రవారం) నుంచి అమల్లోకి వచ్చినట్టు చెబుతూ నోటిఫికేషన్ వెలువడింది. ఇక నుంచి పరీక్ష పేపర్ లీకేజీ కేసులను ఈ చట్టం కింద కేసు నమోదు చేయనున్నారు. దీని ప్రకారం ఎవరైనా చట్ట విరుద్దంగా పరీక్ష పేపర్లను లీక్ చేసినా, పరీక్ష రాసేవారికి సాయం చేసినా, టెక్నాలజీ వినియోగించి ట్యాంపరింగ్ చేయడం, నకిలీ పరీక్షలు నిర్వహించినా కఠిన శిక్ష తప్పదన్నమాట.

 

దీనికి బాధ్యులైన వారికి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలుతోపాటు కోటి వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. ఇందులో భాగస్వాములైనవారు నేరం రుజువైతే వారి ఆస్తులను జప్తు చేయనున్నారు. అంతేకాదు పరీక్ష నిర్వహణకు అయిన ఖర్చును వసూలు చేయనున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నోరువిప్పారు.

 

ఫిబ్రవరిలో చట్టం చేసినా ఎన్నికల నేపథ్యంలో తేదీని ప్రకటించలేదన్నారు. దీనికి సంబంధించి నిబంధనలను న్యాయశాఖ రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ప్రకటించారు. మంత్రి వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రప్రభుత్వం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *