జనంలోకి జగన్.. ఓదార్పు యాత్రకు రెడీ..?

వైసీపీ అధినేత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను, రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రధానంగా పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై జరుగుతున్న దాడులపై చర్చించినట్లు సమాచారం.

 

ఈ సమావేశంలో మాట్లాడిన జగన్ ఓటమి భావనను మరిచిపోవాలని నేతలకు సూచించారు. అంతే కాకుండా ప్రతీ ఇంటికీ తలెత్తుకుని పోవాలని తెలిపారు. కాలం గడిచే కొద్దీ మళ్లీ ప్రజల అభిమానం వ్యక్తం అవుతుందని, భవిష్యత్తులో రికార్డు స్థాయిలో గెలుస్తామని చెప్పుకొచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సానుభూతి పరుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు. వారందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పార్టీపై ఉందని గుర్తు చేశారు.

 

ఈ క్రమంలోనే రాజకీయ దాడుల్లో గాయపడిన వారితో పాటు వైసీపీ ఓటమి బాధతో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్ర కారణంగా క్రింది స్థాయిలో ఉండే నేతలు, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంతో పాటు రాజకీయ పోరాటానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందింది. 175 సీట్లు సాధిస్తామని ధీమాగా చెప్పిన వైసీపీ నేతలు 11 సీట్లలో మాత్రమే గెలిచి.. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి పెట్టిన జగన్ వైసీపీ నేతలతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించి వారికి దిశానిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *