ఇద్దరు పోలీస్‌ కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌ : వెల్లడించిన వైద్యులు

కరోనా పోరులో ముందుండే వైద్యులు, పోలీసులు వైరస్‌ బారినపడటం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీస్‌ సిబ్బంది కరోనా బారినపడగా.. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు పోలీస్‌ సిబ్బందికి వైరస్‌ సోకింది. చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి శనివారం కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనిఖీల్లో భాగంగానే సదరు కానిస్టేబుల్‌ వైరస్‌ బారినపడినట్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
ఇక తుర్కయాంజల్‌ మున్సిపాలిటీ మునగనూరు కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతను రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కానిస్టేబుల్‌ కుటుంబసభ్యులను పరీక్షల నిమిత్తం అధికారులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఇక దేశవ్యాప్తంగా రోజురోజుకూ బలం పుంజుకుంటున్న మహమ్మారి కోవిడ్‌-19 రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే 766 కేసులు నమోదవగా.. 18 మంది మరణించారు. 186 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 562గా ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *