బీజేపీ-ఆర్ఎస్ఎస్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా? సంఘ్తో బీజేపీకి సంబంధాలు సరిగా లేవా? ఈసారి ఎన్నికల్లో సంఘ్ను బీజేపీ దూరంగా పెట్టిందా? సీట్లు తగ్గిపోవడానికి ఇదే కారణమా? కేవలం సోషల్మీడియా, వలస నేతలను మాత్రమే బీజేపీ నమ్ముకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తాజాగా ఎన్నికల ఫలితాలపై ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత రతన్ శార్దా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి భారీ మెజార్టీతో గెలుస్తామన్న అతి విశ్వాసమే బీజేపీ కొంప ముంచిందన్నారు. నేతలు క్షేత్రస్థాయికి వెళ్లకుండా కేవలం సోషల్మీడియానే నమ్ముకున్నారని తన మనసులోని బాధను బయటపెట్టారు. ఆర్ఎస్ఎస్ పత్రిక ఆర్గనైజర్లో సంఘ జీవిత కాల కార్యకర్త రతన్ శార్ధా తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఎన్నికల్లో సంఘ్ స్వయం సేవకుల సహకారం తీసుకోలేదన్నారాయన. అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణమన్నారు. మోదీ ప్రజా కర్షక శక్తిని చూసి ఆనందించారు. క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలేశారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు, మంత్రులు ప్రజలకు అందుబాటులో లేరని వెల్లడించారాయన.
బీజేపీకి సంఘ్ అవసరం లేదా అని సూటిగా ప్రశ్నించారు. స్థానిక నేతలను పక్కనపెట్టి బలవంతంగా వలస అభ్యర్థులను రుద్దారని, ముఖ్యంగా ఫిరాయింపుదారులకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పార్లమెంటేరియన్లను పక్కన పెట్టి చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారని దుయ్యబట్టారు.
ఇవన్నీ కలిసి బీజేపీ 240 సీట్లకు పడిపోవడానికి కారణంగా వర్ణించారు. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థుల్లో 25 శాతం మంది వలస వచ్చినవారేనని కుండబద్దలు కొట్టేశారు. హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి 30 శాతం పైగానే రెబెల్స్ కారణమని తెలుసుకున్నాక, నేతల్లో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు.
అనవస రాజకీయాలు బీజేపీని దెబ్బ తీశాయని పేర్కొన్నారు రతన్ శార్దా. ఇందుకు మహారాష్ట్రని ఓ ఎగ్జాంఫుల్గా ప్రస్తావించారు. అక్కడ పార్టీలను చీల్చడం ముమ్మాటికీ తప్పుగా వర్ణించారు. అజిత్ పవార్ను పక్కన చేర్చుకోవడాన్ని బీజేపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారన్నారు. మహారాష్ట్రలో బీజేపీ కూడా అన్ని పార్టీల మాదిరిగానే తయారైందన్నది ఆయన మాట. ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కోట కూలిపోయిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ను ఉగ్రవాద సంస్థ అని విమర్శించిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకోవడం మరింత దెబ్బ తీసిందన్నారని శార్దా వివరించారు. మొత్తానికి బీజేపీ లోగుట్టును ఆర్ఎస్ఎస్ బట్టబయలు చేసింది.