టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విదేశీ టూర్ ముగించుకుని బుధవారం హైదరాబాద్కు చేరుకున్నారు. బుధవారం ఉదయం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగారు. చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని నివాసానికి చేరుకున్నారు బాబు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత చంద్రబాబు, ఆయన వైఫ్ పురందేశ్వరి ఈనెల 19న అమెరికా వెళ్లారు. పది రోజులపాటు అక్కడే గడిపారు. అధినేత రాకతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎయిర్పోర్టుకు వెళ్లారు. కౌంటింగ్కు సమయం దగ్గరపడుతుండడంతో విదేశీ పర్యటనలో ఉన్న నేతలు స్వదేశానికి పయనమయ్యారు.
దాదాపు రెండునెలలపాటు ఎన్నికల ప్రచారాలతో బిజీ అయ్యారు చంద్రబాబునాయుడు. ముఖ్యంగా నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రోజుకు రెండుమూడు సభలు, రోడ్ షోలు నిర్వహించారు. మే 13న ఏపీ శాసనసభ, లోక్సభకు ఒకే విడతలో పోలింగ్ జరిగింది. కౌంటింగ్ మాత్రం జూన్ నాలుగున జరగనుంది.
బుధవారం హైదరాబాద్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత శుక్రవారం, శనివారం విజయవాడకు వెళ్లనున్నారు. గడిచిన పది రోజులు ఏం జరిగిందనే దానిపై నేతలు, అధినేతతో చర్చించనున్నారు. శనివారం లేదా ఆదివారం పార్టీ ముఖ్యనేతలు, ఎన్నికల అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.