కేజ్రీవాల్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు..!

ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. తనకు మరో వారం రోజులపాటు మధ్యంతర బెయిల్ గడువు పొడిగించాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ ను సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ కొట్టివేసింది. జస్టిస్ కేవీ విశ్వనాథన్, జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. అనంతరం వెకేషన్ బెంచ్ మాట్లాడుతూ.. తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కు పిటిషన్ ను పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ పేర్కొన్నది.

 

కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈ ఏడాది మే 21న ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తన పార్టీ (ఆప్) తరఫున ప్రచారం చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం మే 10న కేజ్రీవాల్ కు కండీషన్లతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ లొంగిపోవాలంటూ కేజ్రీవాల్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

 

సుప్రీంకోర్టు తనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చి, తన పార్టీ తరఫున పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు.

 

అయితే, తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తనకు మరో వారం రోజులపాటు బెయిల్ ను పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ తోసిపుచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *