వైసీపీని ఇంటికి పంపించే సమయం దగ్గర పడిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. తాను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ తన ఐదేళ్ల సంపాదనలో 70 కోట్ల పన్ను కట్టానని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పవన్ .
జగన్ పై గులక రాయి పడితే జనసమూహంతో నిందితున్ని పట్టుకున్న పోలీసులు..అంతర్వేది దగ్గర రథం దగ్ధం చేసిన నిందితులను ఇప్పటి వరకూ గుర్తించలేదని ఆరోపించారు. పక్కనే గోదావరి ఉన్నా కోనసీమ జిల్లాల్లో తాగునీటి సమస్య ఉందని తెలిపారు. కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని పవన్ ఆరోపించారు.
రాష్ట్రంలో వ్యక్తుల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలకు దారితీస్తున్నాయని మండిపడ్డారు. దుష్ట పరిపాలనకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. జగన్ లాంటి గూండాలకు తాను భయపడనని తెలిపారు. ఒక చెయ్యి తమపై ఎత్తితే లక్ష చేతులు లేస్తాయంటూ అంటూ పవన్ హెచ్చరించారు.