సీఎం జగన్ తమ అధినేత పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడారంటూ ఈసీకి జనసేన ఫిర్యాదు చేసింది.
ఏప్రిల్ 16న భీమవరంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను జనసేన తీవ్రంగా ఖండించింది. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసింది. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తాయని ఫిర్యాదులో పేర్కొంది.
మోడల్ కోడ్ కు విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి జగన్ భీమవరంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారంటూ జనసేన ప్రధాన కార్యదర్శి టి. శివశంకరరావు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనాను కలిసి జనసేన ప్రధాన కార్యదర్శి ఫిర్యాదు అందజేశారు.
ఇదిలా ఉండగా.. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్న తీరుపై టీడీపీ ఎన్నికల సంఘానికి మరోసారి ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో పోలీసు అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ సీఈవో మీనాకు ఫిర్యాదు చేసింది.
మాచర్లలో టీడీపీ నేతలపై దాడి జరిగిన సమయంలో సీఐ భక్తవత్సలరెడ్డి అక్కడే ఉన్నారని టీడీపీ తన ఫిర్యాదులో పేర్కొంది. అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న సీఎ భక్తవత్సలరెడ్డిని ఎన్నికల విధుల్లో ఉంచకూడదని కోరింది. ఈయనతో పాటుగా చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో అక్కడి సీఐ గంగిరెడ్డి పనిచేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి అధికారుల వలన ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉండదని వారిని వెంటనే ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ ఈసీని కోరింది.