ఏపీలో అసలు రాజకీయాలు ఇప్పుడు హీటెక్కనున్నాయి. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి టీడీపీ, వైసీపీ పార్టీలు. ఇంకోవైపు కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగేసింది. నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరు అవకాశం ఉంది. ఈసారి సీఎం జగన్పై సమర శంఖం పూరించనున్నారు ఆయన చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత.
వైసీపీ ఓటమే లక్ష్యంగా జగన్పై విమర్శలు ఎక్కుపెట్టనున్నారు ఆయన చెల్లెళ్లు. ఇందుకు అస్త్రాలను సిద్ధం చేశారు. కడప జిల్లాలో జరిగే బస్సు యాత్రలో ముఖ్యంగా వివేకానంద హత్య కేసునే ప్రధానంగా ప్రస్తావించనున్నారు. సొంత చిన్నాన్నను చంపినవారిని కాపాడుతున్నారని, ఇక ప్రజలకు ఏం రక్షణ ఉంటుందనే అజెండాగా సాగనుంది. బద్వేలు నియోజకవర్గంలోని కాశినాయన మండలం అమగంపల్లి నుంచి బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఈ జిల్లాలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే యాత్ర సాగనుంది.
ముఖ్యంగా అన్ని మండలాల ప్రజలతో షర్మిల మమేకం కానున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్య కేసుతోపాటు వైఎస్ ఫ్యామిలీ జరుగుతున్న అంతర్గత కలహాలను ఈ సందర్భంగా ప్రస్తావించే ఛాన్స్ ఉందట. పలుమార్లు మీడియా ముందుకొచ్చిన సునీత.. తన తండ్రి హత్య గురించి ప్రస్తావించారు. జగన్ని దూరంగా పెట్టాలని ఇప్పటికే ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ పరంగానే కాకుండా, పార్టీ వైపు నుంచి షర్మిల ఎలాంటి విమర్శలు సంధిస్తారనే చర్చ ఏపీ అంతటా కొనసాగుతోంది.
సొంత జిల్లా నుంచే జగన్కు వ్యతిరేకంగా సోదరి ఎన్నికల ప్రచారం చేయడం వైసీపీ ఇబ్బందులు తప్ప వన్నది ప్రజల మాట.అలాగే జగన్ పాలనలోని వైఫల్యాలను, ఇచ్చిన హామీలను ప్రజల మధ్య ప్రశ్నించ నున్నారు. శుక్రవారం రాత్రి వరకు కాశినాయన, కలసపాడు పోరుమామిళ్ల బి. కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో బస్సుయాత్ర సాగనుంది. శనివారం నుంచి ఈనెల 12 వరకు ఏయే నియోజకవర్గాల్లో పర్యటన షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. వైఎస్ షర్మిలకు తోడు సునీత కూడా పాల్గొంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి