రూ.151 చెల్లిస్తే భద్రాద్రి రాములోరి తలంబ్రాలు మీ ఇంటికే..

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది.

 

ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కళ్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన ప్రారంభించారు.

 

‘నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది’అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడించారు.

 

భద్రాద్రిలో ఏప్రిల్ 17న అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్‌ నంబర్లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *