రంగంలోకి జనసేనాని, శక్తిపీఠంలో పూజలు, ఆ తర్వాతే..!..

ఏపీలో ఎన్నికల వేడి క్రమక్రమంగా పెరుగుతోంది. ఓ వైపు వైసీపీ, మరోవైపు టీడీపీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఈ జాబితాలోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చేరిపోయారు. శనివారం నుంచి ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. ఇకపై నేతల మధ్య మాటలు తూటాలు పేలనున్నాయి. అంతేకాదు వ్యక్తిగతం కూడా విమర్శలకు పాల్పడే అవకాశముంది. తాజాగా శనివారం నుంచి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

 

శనివారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో నేరుగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చేరుకుంటారు. అక్కడి నుంచి శక్తిపీఠం శ్రీపాద వల్లభుని సన్నిధిలో వారాహి వాహనానికి పూజలు చేయనున్నారు. అనంతం అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి వెళ్లి ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. సాయంత్ర నాలుగు గంటలకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు రామాలయం కూడలికి చేరుకుని అక్కడి నుంచి ప్రసంగిస్తారు పవన్‌కల్యాణ్.

 

పవన్‌కల్యాణ్ ఈనెల 30 నుంచి నాలుగురోజులపాటు పిఠాపురంలోనే బస చేయనున్నారు. తొలిరోజు బహిరంగ సభతో షెడ్యూల్ మొదలవుతుంది. మిగిలిన మూడురోజులు నియోజకవర్గం పరిస్థితిపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా జనసేన-టీడీపీ-బీజేపీ నేతలతో కలిసి సమన్వయం సమావేశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారు. అలాగే మేధావులు, తటస్థులు, కీలకవర్గాలతో భేటీలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ మూడు నుంచి తెనాలి, నాలుగున విజయనగరం జిల్లా నెల్లిమర్ల, ఐదున అనకాపల్లిలో పర్యటించనున్నారు. తొలి విడత ఏప్రిల్ 30 అంటే శనివారం నుంచి ఏప్రిల్ 12 వరకు వివిధ నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటారు పవన్‌కల్యాణ్.

 

మరోవైపు పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయడంతో ఆయన్ని ఓడించేందుకు పక్కాగా ప్లాన్ చేసింది వైసీపీ. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత బరిలో ఉన్నారు. ఇప్పటికే జనసేనకు చెందిన ముఖ్యనేతలను ఆమె తనవైపు తిప్పుకున్నారు. అలాగే సీఎం జగన్‌తో కూడా భేటీ అయ్యారు. మరోవైపు కాపు ఉద్యమనేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు పిఠాపురం బాధ్యతలను అప్పగించ్చింది వైసీపీ అధిష్టానం. ఈ క్రమంలో కాపు సంఘాల నేతలతో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. ఆ నియోజకవర్గమంతా తిరిగేస్తున్నారు. ముఖ్యంగా పవన్, చంద్రబాబు ఓటమి కోసమే తాను వైసీపీలోకి వెళ్లానంటూ ప్రకటనలు చేస్తున్నారు. వీటిని తిప్పికొట్టేందుకు టీడీపీ కూటమి ఎత్తుకుపైఎత్తులు వేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *