అమల్లోకి కొత్త పీఆర్ చట్టం మంత్రి జూపల్లి

అమల్లోకి కొత్త పీఆర్ చట్టం మంత్రి జూపల్లి

రాష్ట్రంలో కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రతి గ్రామంలో నర్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా నిర్ణీత కాలవ్యవధిలో లేఔట్‌, భవన నిర్మాణ అనుమతులు ఇచ్చి తీరాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి నూతన పంచాయతీ రాజ్‌ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివద్ధి శిక్షణ సంస్థలో శుక్రవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మొక్కలు ఎండిపోకుండా అన్ని చర్యలు తీసుకోవడంతోపాటు, వచ్చే హరితహారంలో మొక్కలు నాటేందుకు కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొత్త చట్టం అమలు కోసం గ్రామ, మండల స్థాయిలో అధికారులను నియమించాలని ఆదేశించారు. వేసవికాలంలో పెద్దఎత్తున కూలీలను సమీకరించేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను సమాయత్తం చేయాలన్నారు. సీసీ రోడ్లకు సంబంధించిన అన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని సూచించారు. అన్ని పనులను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. నూతన చట్టంపై అవగాహన కల్పించేందుకు డీపీవోలు, డీఎల్‌పీఓలు, ఈవోఆర్డీలకు ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజులపాటు శిక్షణను సిపార్డ్‌లో నిర్వహించాలని ఆదేశించారు. పీఆర్‌ చట్టం కింద నిబంధనలను సులభంగా అర్ధం చేసుకోవటానికి కరపత్రాలు తయారు చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శుల సహాయంతో గ్రామాల వారీగా అంతర్గత రహదారుల సమాచారాన్ని మే నెలాఖరులోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 
పంచాయతీల్లో ఆన్‌లైన్‌ సేవలపై సమీక్ష 
గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌ సేవలపై మంత్రి జూపల్లి సమీక్షించారు. కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రెజేంటేషన్‌ ద్వారా వివరించారు. లేఅవుట్‌ భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను వసూళ్లు, మ్యుటేషన్‌, ట్రేడ్‌ లైసెన్స్‌ల అనుమతులన్ని ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చేందుకు పంచాయతీ రాజ్‌ శాఖ సిద్ధమవుతున్నది. నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు ఇచ్చేందుకు నూతన పంచాయతీరాజ్‌ చట్టంలో నిబంధనలు పొందుపరిచారు. ఈ మేరకు వేగంగా అనుమతులను ఆన్‌లైన్‌ ద్వారా అందజేస్తారు. ఈ సమావేశంలో సెర్ప్‌ సీఈవో పౌసమిబసు, పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.సత్యనారాయణ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *