నేటితో ముగియనున్న మేడారం మహాజాతర..

వనదేవతల జనజాతర అంగరంగవైభవంగా జరుగుతోంది. నేటి రాత్రి జరగనున్న ఆఖరి ఘట్టంతో మేడారం మహాజాతర ముగియనుంది. నిన్న ఒక్కరోజే అరకోటికిపైగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం సమ్మక్క, సారలమ్మల వనప్రవేశంతో మహాజాతర ముగియనుంది. ఈ 4 రోజులు 2 కోట్లకుపైగానే భక్తులు తరలివస్తారని అంచనా వేశారు. నిన్న సీఎం రేవంత్, గవర్నర్‌ తమిళిసై.. అమ్మవార్లను దర్శించుకుని నిలువెత్తు బంగారం సమర్పించారు.

 

దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ నుంచి పెద్దఎత్తున తరలివస్తుండంటంతో.. మేడారం పరిసరాలన్నీ కోలాహలంగా మారింది. ఇసుకేస్తే రాలనంత జనంతో కళకళలాడుతోంది. గద్దెల దగ్గర అడుగు పెట్టేందుకు వీల్లేనంతగా రద్దీ పెరిగిపోయింది.

 

గద్దెల పరిసరాలన్నీ జనం విసిరే బెల్లం బంగారంతో నిండిపోయింది. దాన్ని ఎప్పటికప్పుడు పూజారులు తీస్తునే ఉన్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులు బంగారం సమర్పించేందుకు గద్దెల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. దీంతో దూరం నుంచే బెల్లం బంగారాన్ని విసిరేయడంతో..అక్కడున్న పూజారులకు చిన్నచిన్న గాయాలు కాకతప్పదు. దీంతో ముందు జాగ్రత్తగా హెల్మెట్లు ధరించి.. అమ్మవార్ల దగ్గర ఉంటున్నారు.

 

ఈనెల 21 నుంచి జాతర జరుగుతోంది. మొదటిరోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెపైకి చేరడంతో మేడారం జాతర స్టార్ట్‌ అవుతోంది. ఆ తరువాత కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చారు. ఆపై సమ్మక్కను చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకువస్తారు. అమ్మవార్లు గద్దెలపైకి చేరిన తర్వాత భక్తులు తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం చివరి రోజు అమ్మావార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈరోజు జాతర ఆఖరి రోజు కావడంతో.. అమ్మవార్ల వనప్రవేశంతో జాతర సమాప్తం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *