భారతదేశంలో కీలకమైన 2024 లోక్సభ ఎన్నికలను సమీపిస్తున్న వేళ.. మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) సర్వే కీలక అంశాలను వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కమాండింగ్ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని ఈ సర్వే తేల్చింది. అయితే, 400కుపైగా సీట్లు వస్తాయన్న లక్ష్యం మాత్రం నెరవేరేలా లేదు.
మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ప్రకారం.. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే.. BJP నేతృత్వంలోని NDA 335 సీట్లు సాధించడం ద్వారా అధికారాన్ని నిలుపుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల పరిమితిని సునాయాసంగా అధిగమించవచ్చు. అయితే, ఈ కూటమి మొత్తం 18 సీట్లు కోల్పోతుందని అంచనా వేసింది. ఇండియా కూటమి గతం కంటే మెరుగ్గా ఫలితాలను చూసే అవకాశం ఉంది.
మూడ్ ఆఫ్ ది నేషన్ ఫిబ్రవరి 2024 ఎడిషన్ అన్ని లోక్సభ స్థానాల్లోని 35,801 మంది ప్రతివాదుల సర్వే ఆధారంగా రూపొందించారు. పోల్ డిసెంబర్ 15, 2023.. జనవరి 28, 2024 మధ్య నిర్వహించారు. కాంగ్రెస్తో కూడిన ఇండియా ప్రతిపక్ష కూటమికి 166 సీట్లు వస్తాయని అంచనా వేసిందీ సర్వే. అయితే NDA బలమైన కోటకు గణనీయమైన సవాల్గా మారడం చాలా తక్కువే.
పార్టీల వారీగా సీట్ల వాటా విషయానికొస్తే.. స్వతంత్రంగా సాధారణ మెజారిటీని సాధించగల సామర్థ్యాన్ని ధృవీకరిస్తూ, 543 సీట్లలో 304 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని అంచనా వేయబడింది. కాషాయ పార్టీ 2019లో తన 303 స్థానాల కంటే ఒక స్థానం మెరుగుపరుస్తుంది. కాంగ్రెస్ గత సారి కంటే 19 స్థానాలు ఎగబాకి 71 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మిగిలిన 168 స్థానాలను ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు సహా ఇతరులు కైవసం చేసుకోనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి అధికారం చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నందున దేశ రాజకీయ రంగంపై ఆయన ప్రభావం గణనీయంగానే ఉంది. MOTN సర్వే మోడీ వారసత్వం, ప్రభుత్వ విజయాలు, వైఫల్యాలు, నేడు దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలపై దృష్టి సారించి, ఆయన పదవీకాలంపై ప్రజల అవగాహన మెరుగుపరుస్తోంది.
కాగా, రామమందిర నిర్మాణం ప్రధానమంత్రి మోడీ వారసత్వంలో అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది, 42 శాతం మంది ప్రతివాదులు దాని ప్రాముఖ్యతను గుర్తించారు. 19 శాతం మంది ప్రధాని మోడీ ప్రపంచంలో భారత స్థాయిని పెంచారని, 12 శాతం మంది ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వంటి వాటిలో20 శాతం మంది బీజేపీకి మద్దతుగా ఉన్నారు. అవినీతి రహిత పాలనకు 14 మంది జనాభా సానుకూలంగా ఉన్నారు. ఇలా పలు అంశాల్లో మెజార్టీ ప్రజలు మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు.