ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు పలు చోట్ల ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నింపుతున్నాయి. అయితే అధిష్టానం వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇవేవీ పట్టించుకోకుండా ఇంకా మార్పులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు సిద్ధం పేరుతో ప్రాంతీయ సభల్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లా భీమిలిలో తొలి సభ నిర్వహించిన జగన్.. ఇవాళ ఏలూరు పక్కనే ఉన్న దెందులూరులో రెండో సభకు సిద్ధమయ్యారు.
అయితే ఇప్పటికే వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇద్దరితో పాటు మరో అసంతృప్త ఎమ్మెల్యే కూడా ఏలూరు సిద్దం సభకు దూరంగా ఉండిపోతున్నారు. ఇప్పటికే వారు తమ నియోజకవర్గాల నుంచి కార్యకర్తల తరలింపు కూడా చేపట్టకుండా సైలెంట్ గా ఉండిపోయారు. దీంతో స్ధానికంగా కొత్తగా నియమించిన ఇన్ ఛార్జ్ లు, లేదంటే పార్లమెంట్ ఇన్ ఛార్జ్ లు జోక్యం చేసుకుని క్యాడర్ ను ఈ సభకు తరలిస్తున్నారు.
ఇలా వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో సిట్టింగ్ సీట్లు కోల్పోతున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో పాటు అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా ఇవాళ ఏలూరు సిద్ధం సభకు దూరంగా ఉండిపోయారు. దీంతో ఒకేసారి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు జగన్ సభకు దూరమైనట్లయింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి కూడా ఇబ్బందికర పరిస్దితి ఏర్పడుతోంది. అయినా పార్టీల్లో ఇవన్నీ సహజమే అని పైకి చెబుతున్నారు.