కోదండరామ్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం రేవంత్..!!

సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ కు పదవి ఖరారు చేసారు. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీన నియమకానికి ప్రభుత్వం ఎంపిక చేసిన వారికి గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో కోదండరామ్ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు కోదండరామ్ ను ఎమ్మెల్సీ చేయటంతో కేబినెట్ లోనూ అవకాశం ఇస్తారా అనే చర్చ మొదలైంది.

 

ఎమ్మెల్సీగా కోదండరామ్ : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్ నామినేటెడ్ పదవుల భర్తీ వేగవంతం చేసారు. తాజాగా నలుగురు సలహాదారులను నియమించిన రేవంత్ తాజాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియ పూర్తి చేసారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియామకం పూర్తయింది. దీంతో, గవర్నర్ కోటాలో ఇద్దరిని ఎంపిక చేసారు.ప్రొఫెసర్ కోదండరామ్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్ భవన్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర తెలపడంతో ప్రొఫెసర్ కోదండరామ్‌కు కీలక పదవి దక్కింది.

 

వరుస నియామకాలు : తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ కీలకంగా వ్యవహరించారు. అయితే, కొంత కాలంగా కోదండరామ్ కు మంత్రివర్గంలోనూ అవకాశం ఇస్తారనే ప్రచారం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఎమ్మెల్సీగా కోదండరామ్ కు ఛాన్స్ దక్కుతుందా, లేక పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటాలో దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేసింది. క్యాబినెట్‌ సిఫార్సు చేసిన అభ్యర్థులకు ఆయా రంగాల్లో ప్రత్యేకతలు, నైపుణ్యాలు, గుర్తించదగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ.. గత ఏడాది సెప్టెంబరు 9న వారి అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

 

నామినేటెడ్ పోస్టుల భర్తీ :తాజాగా హైకోర్టు నుంచి ఈ అంశంలో స్పష్టత రావటంతో ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ ఆమోద ముద్ర వేసారు. ఈ నెలాఖరులోగా కీలకమైన నామినేటెడ్ పోస్టులను సీఎం రేవంత్ భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి సీట్లు ఇవ్వలేకపోయిన వారికి..పార్టీ కోసం పని చేసిన వారికి ముఖ్యమైన పదవులు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 18 మందికి పోస్టులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేడర్ లో జోష్ పెంచేందుకు పదవులను భర్తీ చేసేందుకు రేవంత్ పార్టీ హైకమాండ్ అనుమతి తీసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే మరిన్ని నియామకాలకు సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *