మంత్రి రోజాపై తీవ్ర ఆరోపణలు చేసిన పుత్తూరు వైసీపీ కౌన్సిలర్..

ఏపీ మంత్రి రోజాపై పుత్తూరు వైసీపీ కౌన్సిలర్ భువనేశ్వరి తీవ్ర ఆరోపణలు చేశారు. భువనేశ్వరి పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు. ఆమె వైసీపీ నేత.

 

అయితే, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవి కోసం మంత్రి రోజా రూ.70 లక్షల డబ్బు డిమాండ్ చేశారని భువనేశ్వరి ఆరోపించారు. ఈ క్రమంలో మంత్రి రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డికి మూడు విడతల్లో రూ.40 లక్షలు ఇచ్చానని వెల్లడించారు. చైర్మన్ పదవి ఇవ్వకపోగా, తాను చెల్లించిన డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని భువనేశ్వరి వాపోయారు.

 

రోజా సోదరుడు కుమారస్వామిరెడ్డి పంపిన సత్య అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చానని తెలిపారు. దీనిపై మంత్రి రోజాకు మెసేజ్ చేస్తే కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తాను వైసీపీ కౌన్సిలర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని, రిజర్వేషన్ కూడా ఉండడంతో చైర్మన్ పదవి నీదేనని నమ్మించారని భువనేశ్వరి వివరించారు. కానీ, తన నుంచి డబ్బులు తీసుకుని కూడా చైర్మన్ పదవిని ఇతరులకు అమ్మేశారని ఆరోపించారు.

 

మొదట్లో దీనిపై ప్రశ్నిస్తే రెండో విడతలో అవకాశం ఇస్తామని చెప్పారని, మరోసారి అడిగితే ఎన్నికల తర్వాత అవకాశం ఇస్తామని చెబుతున్నారని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత మహిళను అయిన తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

అంతేకాదు, మంత్రి రోజా సోదరుడు పంపిన వ్యక్తికి తాను డబ్బులు ఇచ్చినట్టు వీడియో ఆధారాలు ఉన్నాయన్న భువనేశ్వరి, కొన్ని వీడియోలను ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *