ఎండాకాలంలో ఎండలు ఉండటం కామనే. కాకపోతే, ఈసారి వాటి తీవ్రత బాగా పెరిగిపోయింది. 40 నుంచీ 47 డిగ్రీల ఎండలొస్తున్నాయి. ఇక రోహిణీకార్తె రావడంతో… రోళ్లు పగలడం ఏమోగానీ… మనం నరకం చూస్తున్నాం. ఉక్కపోతతో చచ్చిపోతున్నాం. ఇంతలో మరో భయంకర వార్త. మరోవారం పాటూ వేడి గాలులు, ఎండలూ ఉంటాయట. ఏపీ RTGS అధికారులు చెబుతున్నారు. మన దురదృష్టం కొద్దీ గాలిలో తేమ తగ్గిపోయింది. అందువల్ల ప్రకాశం, కడప, కర్నూలు, కోస్తాంధ్ర జిల్లాల్లో వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇవాళ కూడా ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరొచ్చనే అంచనాలున్నాయి. అందువల్ల ప్రయాణాలూ, ఇతరత్రా వాయిదా వేసుకోవడం బెటర్.
తెలంగాణ కూడా అగ్నిగుండంగా మారింది. పగలూ రాత్రి తేడా లేకుండా వేడి గాలులు వీస్తున్నాయి. చాలాచోట్ల 45 నుండి 47.8 డిగ్రీలు సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ సూర్యాపేట జిల్లాలోని చాలా చోట్ల 47 డిగ్రీలు ఆపైగా నమోదయ్యా యి. ఈ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజుగా ఆదివారం రికార్డు సృష్టించింది. ఈ నెల 30 వరకూ తెలంగాణలో వేడి గాలులు ఉంటాయట.
సాధారణంగా నైరుతీ రుతుపవనాలు… జూన్ 1, 2న కేరళకు వస్తాయి. ఈసారి మాత్రం జూన్ 5 తర్వాతే వస్తాయట. ఆ తర్వాత అవి తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి మరో వారం లేదా 10 రోజులు పడుతుందని చెబుతున్నారు. ఇలాగైతే ఈ ఎండల్ని మనం తట్టుకోలేం. వీలైనంతవరకూ ఎండలోకి వెళ్లకూడదు. ఇంట్లోనే ఉన్నా, వాటర్ బాగా తాగాలి. ఉప్పు, నిమ్మరసం కలిపిన నీరు తాగితే ఇంకా మంచిది. ఈ విషయాలు మీకు తెలుసుకాబట్టి… జాగ్రత్త పడండి మరి.