అమరావతి: ఏపీలో అత్యధిక స్థానాలను దక్కించుకున్న వైసీపీ నూతనోత్సాహంలో ఉంది. త్వరలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు ప్రారంభించారు. అయితే జూన్ 10, 11 తేదీలలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త సభ్యుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని శాసనసభా కార్యాలయానికి సమాచారం అందించారు. 30న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 7న మంత్రివర్గ విస్తరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గ అమోదంతోనే శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. శాసనసభ నిర్వహణపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో అసెంబ్లీ అధికారులు చర్చించారు.నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. జూన్ 3 నుంచి 6 వరకు శాఖల వారీగా జగన్ సమీక్షలు నిర్వహిస్తారు. ఈ నెల 31, జూన్ 1 తేదీలలో సచివాలయానికి జగన్ రానున్నారు.
ఏపీలో బంఫర్ మెజార్టీతో గెలిచిన వైసీపీ అధినేత జగన్ మే 30న సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారు? ఏఏ ప్రాంతాలకు ఎలాంటి ప్రాధాన్యం ఉంటుంది? ఉప ముఖ్యమంత్రులు ఉంటారా? అన్న అంశాలు ఆసక్తిగా మారాయి. ఏకంగా 151 స్థానాల్లో వైసీపీ గెలవడంతో ఆశావాహుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పలువురు సీనియర్లు, జూనియర్లు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. సీఎం కాకుండా మరో 25 మందికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ 2011లో పార్టీని స్థాపించినప్పుడు సీమాంధ్రకు చెందిన 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతుగా నిలిచారు. వీరిలో నలుగురి మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. అయితే కచ్చితంగా ఎవరెవరికీ అన్నదానిపై స్పష్టత లేదు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాంతాలకు జగన్ ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది.
Dailyhunt