అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మిత్రపక్షం కాదని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్డీఏలో చేరమని బీజేపీ చీఫ్ అమిత్ షా గానీ సీఎం వైయస్ జగన్ గానీ చెప్పలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ప్రజలపక్షమే కానీ ఎవరి మిత్ర పక్షం కాదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ మెుదటి కేబినెట్ సమావేశంలో తీసుకున్న ప్రధానిమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం, పీఎం కిసాన్ పెన్షన్ పథకాలు ద్వారా రైతులు ఎంతో లబ్ధిపొందుతారని తెలిపారు.
14.5 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా వ్యవసాయానికి పెట్టుబడి అందించేందుకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం అద్భుతమని కొనియాడారు. చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ స్కీం చాలా మంచి కార్యక్రమమన్నారు. మోదీకి ప్రజలు పెద్దఎత్తున పట్టం కట్టడం శుభపరిణామమన్నారు.