బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓవర్ లాప్ ల్యాండ్లో ఉన్నారని, సర్వే అనంతరం వ్యత్యాసాలు బయటపడితే ఆయనకు నోటీసులు ఇస్తామని తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో కేవలం ఒక ఎకరం భూమి మాత్రమే ఉందని చూపించిన కేసీఆర్కు వందల కోట్ల విలువైన భూములు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. తమ భూముల కోసం వచ్చిన దళితులను నిలబెట్టి పసుపు నీళ్లు చల్లించిన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి హరీశ్ రావుపై కూడా పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. వట్టినాగులపల్లి భూమిపై హరీశ్ రావు మాటలు మార్చుతున్నారని, ట్రస్ట్ పేరిట భూములను దారి మళ్లించారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో రంగనాయక్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 13 ఎకరాల భూమిని డిలీట్ చేయించి, అతి తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా రూ. 5.40 కోట్ల ప్రభుత్వ నిధులతో ఆ ల్యాండ్కు ప్రయోజనం చేకూరేలా రోడ్డు వేయించుకున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ వ్యాపార కుటుంబాలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్న మంత్రి, ఈ భూ అక్రమాలకు సహకరించిన అధికారులు ఎంతటివారైనా సరే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, సిద్దిపేటలో ఆక్రమణకు గురైన భూముల్లో ‘ఇందిరమ్మ టవర్స్’ నిర్మిస్తామని స్పష్టం చేశారు.