అయోధ్య తుది తీర్పు.. కొత్త సంప్రదాయానికి తెరతీసిన సుప్రీం

భారతదేశ చరిత్రలో శనివారం ఓ కొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం నాటి అయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం ముగింపు పలికింది. సుప్రీం నిర్ణయం కోసం దేశం యావత్తు ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూడగా తనదైన తీర్పుతో సమస్యకు పరిష్కారం చూపింది. హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు వేస్తూ.. ఇటు ముస్లింల కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును మెజార్టీ పక్షాలు స్వాగతించగా, మరికొందరు అసంతృప్తిని వ్యక్తంచేస్తూనే శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసి లౌకికవాద స్ఫూర్తిని చాటుకున్నారు.

అయోధ్య తీర్పు విచారణలో సుప్రీంకోర్టు లోతైన పరిశీలనలు జరిపింది. లిఖిత రూపంలోని మతపరమైన పత్రాలు, ట్రావెలాగ్‌లు, పురావస్తు శాఖ నివేదికలు, బాబ్రీమసీదు కూల్చివేతకు పూర్వం నాటి ఫొటోలు మొత్తం 533 సాక్ష్యాలను రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిచింది. వీటితోపాటు శిలాశాసనాల అనువాదాలు, పలువురు చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సహా 88 మంది సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. విచారణలో తమ పరిశీలనకు వచ్చిన అంశాల ఆధారంగా ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. మొత్తం 1045 పేజీల తీర్పు సారాంశాన్ని జస్టిస్‌ రంజన్‌ గొగొయి 45 నిమిషాల పాటు చదివి వినిపించారు. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ సభ్యులుగా ఉన్నారు.


సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలం విచారణ సాగిన రెండో కేసుగా ఆయోధ్య వివాదం గుర్తింపు పొందింది. అలాగే ఈ తీర్పు సమయంలో న్యాయస్థానం సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఏదైనా కేసు తీర్పు వెలువరించేటప్పుడు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఒక్కొక్కరూ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ, దీనికి భిన్నంగా అయోధ్య తీర్పు విషయంలో సుప్రీం వ్యవహరించింది. తీర్పును చదువుతున్నప్పుడు ధర్మాసనంలోని సభ్యులు పేర్లను ప్రస్తావించలేదు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చెప్పకుండా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరిస్తున్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *