మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ (LPG) సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో LPG దిగుమతులకు అంతరాయం ఏర్పడినా దేశీయంగా కొరత రాకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలు, చమురు-గ్యాస్ సంస్థలకు గరిష్ఠ LPG ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది.
ఆగస్టు 13న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 21 రిఫైనరీలు, అప్స్ట్రీమ్ సంస్థలకు రోజువారీ LPG ఉత్పత్తి లక్ష్యాలను నిర్ణయించారు. వీటి మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 63,810 టన్నులుగా నిర్దేశించారు. ఈ పరిమాణం 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా నమోదైన LPG ఉత్పత్తి కంటే రెండింతలకు పైగా కావడం గమనార్హం.
దేశ రోజువారీ LPG వినియోగంలో ఈ లక్ష్యం దాదాపు 70 శాతానికి సమానంగా ఉంటుంది. అయితే సాధారణ పరిస్థితుల్లో ఈ ఉత్పత్తి లక్ష్యాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన అవసరం లేదు. దేశంలో LPG సరఫరాలో కొరత ఏర్పడినప్పుడు మాత్రమే నిర్దేశించిన ఉత్పత్తి పరిమితులు అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ చర్యలతో అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం దేశీయ LPG సరఫరాపై పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.