ఆంధ్రప్రదేశ్ ప్రగతి ప్రయాణంలో ఈరోజు ఒక చారిత్రాత్మక ఘట్టమని ప్రధాని మోదీ కొనియాడారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం అనంతం నిర్వహించిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్’ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా ఇదొక శుభపరిణామమని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్టును జాతికి అంకింతం చేయడంతో పాటు రూ.18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రోరంభోత్సవాలు చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు.
అంతకుముందు ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా సింహాచలం అప్పన్న స్వామితో పాటు పైడితల్లి అమ్మవారిని మోదీ స్మరించుకున్నారు. పుణ్యభూమి అయిన ఉత్తరాంధ్రకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాంధ్ర వేదికగా కొత్తగా ప్రారంభించిన పనులు.. రాష్ట్రాన్ని వేగవంతమైన వృద్ధి వైపు నడిపిస్తాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక గిరిజన కళాకారులు ప్రదర్శించిన ‘ధింసా’ నృత్యం తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్నారు. ఒకే వేదికపై 13 వేల మంది మహిళలు ఈ ప్రదర్శన ఇవ్వడం ఒక అద్భుతమైన రికార్డని కొనియాడారు. ఈ విజన్ను నిజం చేసిన సీఎం చంద్రబాబుకి ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు
భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు
అటు భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక రవాణా కేంద్రం మాత్రమే కాదన్న మోదీ.. అది ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు కొత్త ఊపిరిలు పోస్తుందన్నారు. ఏపీ యువత భవిష్యత్తుకు బలమైన లాంచ్పాడ్ కాబోతుందని పేర్కొన్నారు. మరోవైపు విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడంపై కూడా మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కీలకమైన నిర్మాణాలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టే ఆచారం ఉండేదన్నారు. కానీ తమ ఎన్డీఏ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా స్థానిక మహనీయుల పేర్లు పెట్టి వారిని గౌరవిస్తోందన్నారు.
అయోధ్య ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి, పంజాబ్లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టినట్లే.. ఈ భోగాపురం విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేశామని వివరించారు. 2014 నాటికి దేశంలో కేవలం 74 ఎయిర్పోర్టులు ఉంటే.. గత 12 ఏళ్లలో ఆ సంఖ్యను 166కు పెంచామని మోదీ తెలిపారు. ‘ఉడాన్’ పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేశారు.
ఏపీలోని సుదీర్ఘమైన తీర ప్రాంత అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ అన్నారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకూ ఉన్న ఓడరేవులను ‘బ్లూ ఎకానమీ’ కింద ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. అలాగే మూలపేట, రామాయపట్నాల్లో కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. మరోవైపు ప్రస్తుతం రూ. లక్ష కోట్ల విలువైన రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్టులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు సారథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా ఏపీ మారుతోందని మోదీ ప్రశసించారు. పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి తరలివస్తున్నట్లు చెప్పారు. సెమీకండక్టర్లు, డేటా సెంటర్లు, నక్కపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న భారీ ఫార్మా రంగాలు రాష్ట్రంలో కొత్త గ్రోత్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నాయని తెలిపారు. ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ వల్లే ఏపీ డబుల్ స్పీడ్ తో అభివృద్ధి చెందుతోందని మోదీ చెప్పుకొచ్చారు.