సీఎం అయినా భార్యను అడగాల్సిందే… పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు

ముఖ్యమంత్రి హోదాలో అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు ఎన్నో బిజీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ, కొన్నిసార్లు జరిగే చిన్న చిన్న సంఘటనలు ఆ పర్యటనకే ప్రత్యేకతను తెస్తాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా పర్యటనలో సరిగ్గా ఇలాంటి ఆసక్తికర ఘటనే చోటుచేసుకుంది. ఓ రైతు క్షేత్రంలో కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనెను కొనుగోలు చేసే ముందు, ముఖ్యమంత్రి తన అర్ధాంగి భువనేశ్వరికి ఫోన్ చేసి మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. “ఇంట్లో ఏ వస్తువు కొనాలన్నా ఆమెను అడగాలి” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించి, అక్కడి నుంచే ఆమెతో మాట్లాడి కిలో నూనెను కొనుగోలు చేశారు. ఈ ఘటన శనివారం చిలకలూరిపేట సమీపంలోని లింగంగుంట్లలో జరిగింది.

‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, లింగంగుంట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణం పొలాన్ని సందర్శించారు. గత నాలుగేళ్లుగా రసాయనాలు లేకుండా తాను సాగు చేస్తున్న విధానాలను నాగభూషణం ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి, భూసారం పెరిగి మంచి దిగుబడులతో వ్యవసాయం లాభదాయకంగా మారిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతు నాగభూషణాన్ని అభినందించిన చంద్రబాబు, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అనంతరం, రైతు నాగభూషణానికి చెందిన ఆర్గానిక్ వేరుశనగ గానుగను సీఎం పరిశీలించారు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి వంటి వాటితో సహజ పద్ధతిలో నూనె తీస్తున్నామని రైతు వివరించి, ఈ నూనెను వాడి చూడాలని కోరగా చంద్రబాబు పైవిధంగా స్పందించి తన భార్యతో మాట్లాడి నూనె కొన్నారు. ఈ పర్యటనలో భాగంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని కూడా చంద్రబాబు సందర్శించి, అక్కడ జీవామృతం, ఘన జీవామృతం వంటివి తయారుచేస్తున్న తీరును పరిశీలించారు. అనంతరం రైతు సాగు చేస్తున్న బొప్పాయి తోటను చూసి, ఆయన అందించిన పండును రుచి చూశారు.