ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఆదివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. త్వరలో గ్రామ సభల ద్వారా ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకుంటామన్నారు.
అర్హత ఉన్నవారు గ్రామ సభల్లో అధికారులకు దరఖాస్తులు నింపి అందజేయాలన్నారు. ప్రజలు దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రశీదు ఇస్తారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర దరఖాస్తులు స్వీకరిస్తారని, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారని మంత్రి తెలియజేశారు. అయితే గ్రామ సభలకు కావాల్సిన నిధులను త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేస్తారన్నారు.
ధరణి పోర్టల్ ద్వారా గత పాలకులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసి రెగ్యులరైజేషన్ చేసుకున్నారని మంత్రి ఆరోపించారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ధరణిని ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ధరణిని ప్రక్షాళన చేసి, ప్రభుత్వం దోచుకున్న ఆస్తులను మళ్లీ ప్రజలకు చెందేలా చర్యలు తీసుకుంటామని పొంగులేటి హామీ ఇచ్చారు.