తేది:15-04-2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానీయుడు డాక్టర్ భీంరావు అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను తేది 14-04-2026 నాడు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మరియు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు, బార్ సభ్యులు మరియు న్యాయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి దేశానికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అనే మహత్తర విలువలను అందించిన మహనీయుడిగా ఆయన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
డాక్టర్ అంబేద్కర్ చూపిన మార్గం ప్రతి న్యాయవాది మరియు ప్రతి భారతీయుడికి మార్గదర్శకంగా నిలుస్తుందని, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం మరియు న్యాయ పరిరక్షణ కోసం ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం మన అందరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన చేసిన మహత్తర సేవలను గుర్తుచేసుకుంటూ, రాజ్యాంగ విలువలను కాపాడుతూ సమాజానికి న్యాయం అందించేందుకు కట్టుబడి పనిచేయాలని న్యాయవాదులు అందరూ సంకల్పించారు.