కొత్త పార్టీపై క‌విత కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..?

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త ప్రాంతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు చేశారు. వచ్చే ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు శుభ ముహూర్తాన పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ ఉంటుందని ఆమె వెల్లడించారు. మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్, పూడూరు వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి, ఈ సభ ద్వారా తన రాజకీయ భవిష్యత్తు కార్యాచరణను ప్రజల ముందుకు తీసుకురానున్నారు.

రాజకీయాలు అంటే ‘రాకెట్ సైన్స్’ ఏమీ కాదని, ఒకవేళ అది రాకెట్ సైన్స్ అయినా సరే, మన జీవితాలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన అంశం కాబట్టి దానిని అర్థం చేసుకోవడం, అందులో భాగస్వాములు కావడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పిలుపునిచ్చారు. “రాజకీయాలకు దూరంగా ఉండకండి.. వ్యవస్థను మార్చాలంటే వ్యవస్థ లోపలికి రావాలి” అని కవిత తెలంగాణ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఎవరో పెట్టిన సిస్టమ్‌ను కేవలం సరిదిద్దడం కాకుండా, సంపూర్ణంగా రూపాంతరం (Transform) చెందించడమే జాగృతి పార్టీ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు గడుస్తున్నా మౌలిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని, రైతుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కూడా పోరాడాల్సిన దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

కేవలం పాలకులను ప్రశంసించడమే కాదు, పనులు జరిగే వరకు పట్టుబట్టి ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో నింపుతామని కవిత పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడటం, మైనారిటీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేయడంపై పార్టీ దృష్టి పెడుతుంది. కొందరు నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మరోలా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని, అటువంటి “మతిమరుపు” రాజకీయాలకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.

 

రాష్ట్రంలో ఇప్పటివరకు పురుషుల నాయకత్వంలోని పార్టీలను ప్రజలు చూశారని, ఇకపై ఒక ఆడబిడ్డ నడిపే పార్టీ అసలైన మార్పును చూపిస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. “నిజమైన మార్పు ఏంటో చూపిస్తాం” అని పేర్కొంటూ, మహిళా సాధికారతకు ఈ పార్టీ ప్రాధాన్యతనిస్తుందని సూచించారు. పార్టీ ప్రకటనకు ముందు వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి, రాముని ఆశీర్వాదంతో ప్రచారాన్ని ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.

 

కొత్త పార్టీ నిర్మాణం కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలను కవిత ఆహ్వానించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడిని అందుబాటులోకి తీసుకురానున్నారు. రాబోయే 28 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మేధావులు, కవులు మరియు పాత్రికేయులతో విస్తృతంగా చర్చించనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.

 

తన పార్టీ ఎవరికీ ‘బీ-టీమ్’ కాదని, తెలంగాణ ఆత్మగౌరవమే అజెండాగా ఈ ప్రాంతీయ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గి, జాతీయ పార్టీలకు దారి మల్లుతున్న తరుణంలో.. తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా ‘జాగృతి’ నిలబడుతుందని ఆమె పేర్కొన్నారు. పాత, కొత్త రక్తం కలయికతో పార్టీ శక్తివంతంగా పనిచేస్తుందని, బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం తమతోనే ఉందని ఆమె వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తెలంగాణలో నంబర్ వన్ పార్టీగా అవతరిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *