ఏపీలో ప్రతిపక్ష వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఢీ కొట్టేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకోసం సీరియస్గా కసరత్తు చేయడంతో పాటు పార్టీ వాయిస్ను బలంగా జనంలోకి తీసుకెళ్లే నేతలను ఎంపిక చేసే పనిలో తలమునకలైనట్టు సమాచారం. మరో ఐదు నెలల్లో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలే టార్గెట్గా కూటమి ప్రభుత్వం పాలన, వైఫల్యాలను జనంలో ఎండగట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ ఇప్పటికే ఆ పనుల్లో నిమగ్నమైనట్టు తెలిసింది. అందుకే ఆయన ప్రజల్లోకి వెళ్లడం లేదని చర్చ జరుగుతున్నది. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన జనంలోకి వెళ్లి కూటమి సర్కార్ తీరును ప్రజలకు వివరించాలని చూస్తున్నట్టు తెలిసింది.
Advertisement
ఎవరి పాలన బాగుంది?
జగన్ హయాంలో ప్రభుత్వ పరమైన సంస్థలకు అధికంగా నిధులు కేటాయించారని, స్కూల్స్, కాలేజీలు, వైద్యారోగ్యం మెరుగుపరచడానికి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారని వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. కానీ, ప్రస్తుత కూటమి సర్కారులో మాత్రం ప్రభుత్వ ఆధ్వరంలో నడిచే వాటికి నిధులు ఎక్కువగా కేటాయించకుండా వాటిని పబ్లిక్ ప్రయివేటు పరం చేస్తున్నారని ప్రతిపక్షం ప్రధాన ఆరోపణ. ఆ మధ్య మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేసి, వాటి నిర్వాహణ చూస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.దానిని మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.విద్యా, వైద్యాన్ని చంద్రబాబు సర్కార్ వ్యాపారం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. దీనికి తోడు పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కొందరు ఏకంగా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సిక్స్ గ్యారెంటీస్పై నిలదీత..
ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ సిక్స్ గ్యారంటీస్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది.ఓ వైపు స్కీమ్స్ , మరోవైపు జగన్ పాలన మీద విరక్తితో నాడు ప్రజలు కూటమి సర్కార్కు పట్టం కట్టారు. రోజులు మారుతున్న కొద్దీ ఏపీ ప్రజల వైఖరిలో మార్పు వస్తున్నట్టు వైసీపీ పదే పదే చెబుతోంది. కూటమి పాలన మీద వ్యతిరేకత మొదలైందని, చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని, ప్రజలు నిరాశతో ఉన్నారని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిక్స్ గ్యారంటీస్ ఫెయిల్యూర్, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు పరం చేయడం వంటి అంశాల మీద జగన్ యుద్ధం ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇందుకోసం గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్న జగన్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావడానికి మూడేండ్ల ముందు నుంచే కూటమి సర్కార్ మీద ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి కలిసొచ్చే ఏ అంశాన్ని వదలరాదని పార్టీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రాజధాని రైతులకు ఇంకా పరిహారం అందకపోవడం, ఆలస్యం కావడంపైనా జగన్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గతంలో అమరావతి రైతులను జగన్ అవమానించారు.వారి ఉద్యమాన్ని పెయిడ్ ఆర్టిస్టుల పోరాటంగా అభివర్ణించారు. కానీ, ఇప్పుడు వారి మద్దతు కోసం ఆరాట పడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. మరోసారి ఉద్యోగుల మద్దతను సైతం కూడగట్టే పనిలో జగన్ అండ్ కో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.