నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. 2016 నుంచి 2024 వరకు ఉన్న కాలానికి సంబంధించి సుమారు 127 ఎస్ఎస్ఐ యూనిట్లపై అధికారులు రూ.19కోట్ల బ్యాక్ బిల్లింగ్ భారం మోపారని అది సర్చార్జిలతో కలిపి ఇప్పుడు రూ.38కోట్లకు చేరిందన్నారు. ఈ భారీ బకాయిలను చెల్లించలేక అనేక యూనిట్లు మూతపడటంతో పాటు ఇటీవల కాలంలో ఆర్థిక ఇబ్బందులతో 13 మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లుల భారాన్ని మానవీయ కోణంలో రద్దు చేసి నేతన్నను అదుకోవాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల నేతకా ర్మికుల కష్టాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బుధవారం కలిసిన కేటీఆర్.. వారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల పట్టణం రాష్ట్ర వస్త్ర పరిశ్రమకు గుండెకాయ వంటిదని, గతంలో ఇక్కడ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడిన చేదు జ్ఞాపకాలను వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో 25 హెచ్పీ వరకు విద్యుత్ సబ్సిడీ పెంచడం వల్ల పరిశ్రమ నిలదొక్కుకుందని, అయితే ప్రస్తుతం విద్యుత్ అధికారులు విధిస్తున్న ‘బ్యాక్ బిల్లింగ్’ భారం వల్ల వేలాది కుటుంబాల జీవనోపాధి ప్రమాదంలో పడిందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను, కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ఉన్న బ్యాక్ బిల్లింగ్ , సర్చార్జి మొత్తాలను పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
పాత బకాయిలతో సంబంధం లేకుండా, పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించాలన్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్య కేవలం ఒక ప్రాంతానిది కాదని, అది వేలాది కుటుంబాల మనుగడకు సంబంధించినదని గుర్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.