గ్యాస్ వినియోగదారులకు అలర్ట్..! రీఫిల్ బుకింగ్ గడువు పెంపు, ఈసారి 35 రోజులు..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. ఏమాత్రం తగ్గే పరిస్థితులు కనిపించడం లేదు. హోర్మూజ్ జలసంధి నుంచి ఇండియాకు చమురు షిప్‌లు వస్తున్నా.. గ్యాస్ కొరత ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా వెంటాడుతూనే ఉంది. తాజాగా చమురు కంపెనీలు గ్యాస్ సరఫరా కోసం కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి. ఈసారి గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు 35 రోజులకు పెంచాయి.

 

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్

 

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నాలుగో వారం నడుస్తోంది. దీని కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే హోర్మూజ్ జలసంధి నుంచి అమెరికా, ఇజ్రాయెల్ లకు మద్దతు ఇచ్చేవారికి కాకుండా మిగతా దేశాల చమురు షిప్‌లను పంపిస్తోంది ఇరాన్. అందుకు ట్యాక్స్ సైతం వసూలు చేస్తోంది. ఈ పరిస్థితులు ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

 

తాజాగా వంటగ్యాస్‌ సిలిండర్‌ రీఫిల్‌ బుకింగ్‌ మధ్య గడువు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డబుల్‌ సిలిండర్‌ ఉంటే బుకింగ్‌ మధ్య గడువు కనీసం 35 రోజులు ఉండాలని తేల్చి చెప్పాయి. తొలుత ఈ గడువు 21 రోజులు ఉండేది. మార్చి రెండో వారంలో 25 రోజులకు పెంచారు. తాజాగా 35 రోజులకు పెంచడంతో గ్యాస్ వినియోగదారులు కాస్త అయోమయంలో పడ్డారు.

 

రీఫిల్ బుకింగ్ గడువు పెంపు, ఈసారి 35 రోజులు

 

రెండు సిలిండర్లు ఉన్నవారికి కొత్త నిబంధన వర్తించనుంది. నార్మల్‌గా సింగిల్ సిలిండర్ ఉంటే నగరాలు, పట్టణాల్లో 25 రోజుల తర్వాత బుకింగ్ చేసుకుంటారు. అదే గ్రామాల్లో 45 రోజుల తర్వాత బుక్ చేయాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన కింద ఉండే వినియోగదారులు సిలిండర్‌ బుకింగ్‌ గడువును 45 రోజులకు పెంచింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు ఇదే నిబంధన కంటిన్యూ కానుంది.

 

దీనిపై వినియోగదారులు ఏమంటున్నారు? నగరాలు, పట్టణాల్లో చాలామంది గ్యాస్ వినియోగదారులు గ్యాస్ చేసుకుని నెల రోజులు గడుస్తున్నా ఇంకా రాలేదని చెబుతున్నారు. గ్యాస్ పంపిణీదారులను అడిగితే గ్యాస్ కొరత వల్ల కొద్దిరోజులు ఆలస్యం కావచ్చని చెబుతున్నారు. కానీ ఎప్పుడు ఇస్తామన్నది చెప్పలేదని గగ్గోలు పెడుతున్నారు వినియోగదారులు.

 

ఇటీవల లోక్ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ, జలసంధి నుంచి నౌకా రవాణా సవాల్ గా మారిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొంత పెట్రోల్ నిల్వలు మన దగ్గర ఉన్నాయని తెలిపారు. యుద్ధం ప్రభావం కొన్నాళ్లు ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతుందని చెప్పకనే చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన తర్వాత చమురు కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *