కుంభమేళా సమయంలో తీసిన ఫోటోల వల్ల ఒక్కసారిగా సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందిన మోనాలిసా పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో వినిపిస్తోంది. ఈసారి ఆమె వ్యక్తిగతంగా ఎదుర్కొన్న.. అనుభవాలు కారణంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఒక దర్శకుడిపై ఆమె చేసిన ఆరోపణలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
కొచ్చిలో జరిగిన మీడియా సమావేశంలో మోనాలిసా తన అనుభవాలను వివరంగా చెప్పింది. సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు సనోజ్ మిశ్రా తనతో సరైన విధంగా ప్రవర్తించలేదని ఆమె పేర్కొంది. తనకు అసౌకర్యంగా అనిపించేలా పలుమార్లు తాకాడని, ఆ సమయంలో చాలా భయపడిపోయానని ఆమె తెలిపింది. ఆ ఘటనలను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి గురైంది.
ఆ సమయంలో తాను చిన్న వయసులో ఉండటం వల్ల ఈ విషయం బయటకు చెప్పలేకపోయానని ఆమె చెప్పింది. ఇంట్లో చెప్పినప్పటికీ, అది మొదటి సినిమా కావడంతో సహించమని సూచించారని తెలిపింది. దీంతో తనకు బాధ కలిగినా మౌనంగా ఉండాల్సి వచ్చిందని వివరించింది.
ఇటీవల మోనాలిసా ఫర్మాన్ ఖాన్ను వివాహం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఆమె భర్తతో కలిసి హాజరైంది. ప్రస్తుతం వారు కేరళలో నివసిస్తున్నారు. అయితే కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తమ భద్రతపై ఆందోళన ఉందని తెలిపారు.
ఈ ఘటనపై త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె నిర్ణయించింది. తనకు న్యాయం కావాలని, భవిష్యత్తులో మరెవరూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటపెట్టానని చెప్పింది.