వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం గురించి ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ జరుగుతున్నది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అందుకే రహస్యంగా కొన్ని మంతనాలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో వైసీపీ గెలుపునకు ఉపయోగపడిన స్ట్రాటజీని మరోసారి అప్లయ్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మారిన పరిస్థితులకు అనుగుణంగా అధికార పార్టీని ఢీకొట్టి మరోసారి ప్రజల మన్ననలు పొందేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సాయం తీసుకోవాల్సిన అవసరమని ఏర్పడిందని, జగన్ సైతం అందుకు సిద్ధంగా ఉన్నట్టు పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.
2019లో పీకే వ్యూహం సక్సెస్..
2019లో ప్రభుత్వ ఏర్పాటులో వైఎస్ జగన్కు పీకే వ్యూహం ఎంతగానో కలిసి వచ్చింది. నాడు జగన్కు పీకే వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాలను కైవసం చేసుకున్నది. దీంతో తొలిసారిగా జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అందుకు పీకే భారీగానే డబ్బు అందుకున్నట్టు ప్రచారం జరిగింది. ఐదేండ్ల పాలన తర్వాత జగన్ అధికారానికి దూరం అవ్వడంతో మరల అధికారంలోకి వచ్చేందుకు ఆయన మరోసారి ఎన్నికల స్ట్రాటజిస్ట్ సలహాలు, సూచనల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే, ప్రశాంత్ కిషోర్ మరోసారి జగన్తో జతకడతారా? అనేది తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ చాలా బలంగా ఉన్నది. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబుడులు, విద్యా, ఆరోగ్యం ఇలా అన్నిరంగాల్లోనూ దూసుకువెళ్తున్నది. ఇటువంటి సమయంలో జగన్కు పీకే సాయం చేస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.
ఎన్నికల స్ట్రాటజీకి దూరం..!
ఉత్తరాదికి చెందిన ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ గత కాలంగా పొలిటికల్ సలహాలు, సూచనలు ఇవ్వడం మానేశారు. తన సొంత రాష్ట్రం బిహార్లో జనసురాజ్ పార్టీని స్థాపించిన ఆయన ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తను బరిలోకి దిగకుండా, పార్టీ గుర్తుపై అభ్యర్థులను పోటీకి దింపారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమిని చవిచూసింది. గతంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీకి, ఏపీలో వైసీపీకి, బెంగాల్లో టీఎంసీ విజయానికి ఆయన స్ట్రాటజీ ఎంతోగానే పనిచేసింది. కానీ, సొంత పార్టీని విజయతీరాలకు చేర్చడంలో ఆయన విఫలం అయ్యారు. దీంతో ఆయన ఎన్నికల స్ట్రాటజిస్ట్గా తప్పుకున్నట్టు కథనాలు వచ్చాయి. జనసురాజ్ పార్టీ ఓటమే ఆయన నిర్ణయానికి కారణమని జోరుగా చర్చ జరుగుతున్నది.
ఇదిలాఉండగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పీకే శిష్యుడు సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహాలు బాగా పనిచేశాయని టాక్ ఉంది. ఒకవేళ పీకే జగన్కు స్ట్రాటజిస్ట్గా పనిచేయకపోతే తన శిష్యుడిని పురమాయించే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతున్నది. ఏదేమైనా జగన్ ..మరల అధికారంలోకి వచ్చేందుకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సాయం తీసుకుంటారా? లేక గతంలో తన ప్రభుత్వ హయాంలో అందించిన సంక్షేమాన్ని నమ్ముకుని వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతారా? అనేది తెలియాల్సి ఉన్నది. కాగా, ప్రశాంత్ కిషోర్తో జతకడితే జగన్కు కలిసి వచ్చే అంశాలు చాలానే ఉన్నాయని జోరుగా చర్చ జరుగుతున్నది. కానీ, వీరి భేటీపై త్వరలోనే క్లారిటీ రానుంది.