విశాఖపట్నం నగరం మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. నగర ప్రజల చిరకాల నిరీక్షణకు తెరదించుతూ, ప్రముఖ షాపింగ్ డెస్టినేషన్ ‘ఇనార్బిట్ మాల్’ వైభవంగా ప్రారంభమైంది. విశాఖ పోర్టు అథారిటీకి చెందిన స్థలంలో నిర్మితమైన ఈ భారీ మాల్ను పోర్టు చైర్మన్ అంగముత్తు, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరియు రహేజా గ్రూప్ ప్రతినిధులు కలిసి ప్రారంభించారు. ఈ వేడుక సందర్భంగా కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి శర్భానంద సోనోవాల్ వీడియో సందేశం ద్వారా తన శుభాకాంక్షలను తెలియజేశారు.
ఈ సందర్భంగా విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ అంగముత్తు మాట్లాడుతూ.. విశాఖ ప్రజల సౌకర్యార్థం పోర్టు స్థలంలో ఇంతటి భారీ మాల్ను నిర్మించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. “ఈ ఇనార్బిట్ మాల్ కేవలం ఒక షాపింగ్ సెంటర్ మాత్రమే కాదు, దీని ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. కేవలం వ్యాపార సముదాయాలే కాకుండా, సామాజిక బాధ్యతలో భాగంగా పోర్టు గోల్డెన్ హాస్పిటల్ను కూడా అభివృద్ధి చేస్తున్నామని.. త్వరలోనే ఈ ఆసుపత్రిని నగర ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. తన నియోజకవర్గ పరిధిలో దేశంలోనే అత్యంత పెద్దదైన మాల్లలో ఒకటి ఏర్పాటు కావడం శుభపరిణామమని కొనియాడారు. “కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకవైపు ఈ మాల్ ప్రారంభం కాగా, మరోవైపు అనకాపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరుగుతోంది” అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో విశాఖ నగరం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మారుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ ఇనార్బిట్ మాల్ నగర వాసులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభవాన్ని అందించడమే కాకుండా, పర్యాటక పరంగా కూడా విశాఖ ప్రాముఖ్యతను మరింత పెంచనుంది. అత్యాధునిక హంగులు, గ్లోబల్ బ్రాండ్స్ మరియు ఫుడ్ కోర్టులతో అలరారుతున్న ఈ మాల్ నేటి నుండే సందర్శకులకు అందుబాటులోకి రానుంది