ఈనెల 22 ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో గత మూడు రోజులుగా రైతు మహోత్సవాలు జరుగుతున్నాయి. రైతు మహోత్సవాలకు వివిధ జిల్లాల నుండి భారీగా రైతులు తరలివస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన 150 స్టాల్ లలో వ్యవసాయ యాంత్రీకరణ, ఆయిల్ ఫామ్ తోటల పెంపకంలో మెలుకువలు ,వ్యవసాయం తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలైన ఉద్యానవన, పాడి పరిశ్రమ, మత్స్య రంగాల ద్వారా అధిక దిగుబడి సాధించడానికి శాస్త్రవేత్తల ద్వారా మెలుకువలు నేర్చుకోవడంతో ఆధునిక వ్యవసాయాన్ని అవగాహన చేసుకుంటున్నారు.
ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం
రేపు 22 మార్చ్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు నర్మేట లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం పై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ,పోలీస్ కమిషనర్ ,అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన లో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభించి పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శిస్తారు.తెలంగాణ లో మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ కి శంకుస్థాపన చేస్తారు. సభ కి వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రులు సూచనలు చేశారు. హెలిపాడ్ , సభ వేదిక , భద్రత, తాగు నీరు , ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్ ,విద్యుత్ ,సౌండ్ సిస్టమ్, ఫైర్,అంబులెన్స్ తదితర వాటిపై అధికారులకు సూచనలు చేశారు.