విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) వార్షిక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మిట్టల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 అమలులో సీఐఐ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులలో నమ్మకం పెరిగిందని, అందుకే అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి నిదర్శనంగా ఈ నెల 23వ తేదీన మిట్టల్ స్టీల్ ప్లాంట్కు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు మంత్రి లోకేష్ ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలిపారు.
రైల్వే జోన్పై ప్రత్యేక దృష్టి
గత ప్రభుత్వం భూమి కేటాయింపులో విఫలమవ్వడం వల్లే రైల్వే జోన్ పనులు నలిగాయని విమర్శిస్తూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణం ప్రారంభమైందని, జనరల్ మేనేజర్ (GM) నియామకం కూడా పూర్తయిందని చెప్పారు. ప్రస్తుతం రైల్వే జోన్ సరిహద్దులు , కేకే లైన్ (కొత్తవలస-కిరండూల్) అంశాలపై చర్చలు జరుగుతున్నాయని, ఇవి కొలిక్కి రాగానే అధికారిక నోటిఫికేషన్ వెలువడుతుందని స్పష్టం చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్టు
ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 2026 జూన్ చివరి నాటికి ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు మంత్రి వివరించారు. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే సమయానికే దానికి కావాల్సిన రోడ్డు కనెక్టివిటీ పనులను కూడా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణం వల్ల విమాన ఛార్జీలు పెరిగే సూచనలు ఉన్నాయన్నారు. అయితే ప్రయాణికులపై భారం పడకుండా తగిన చర్యలు తీసుకునేందుకు చర్చిస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారు.