భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్ గోపాల్ వర్మ, తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’ మరియు దర్శకుడు ఆదిత్య ధర్పై ప్రశంసల జల్లు కురిపించారు. అయితే, ఇది కేవలం ఒక సినిమా రివ్యూ మాత్రమే కాదు.. ఇన్నాళ్లూ ప్రేక్షకుల తెలివితేటలను అవమానిస్తూ, రొటీన్ ఫార్ములాతో సినిమాలు తీస్తున్న మేకర్లపై ఆయన సంధించిన ఒక పదునైన అస్త్రం అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఫిల్మ్ అంటే ఇదే..
ఆర్జీవీ తన విశ్లేషణలో ‘ధురంధర్ 2’ను ఒక ‘హారర్’ సినిమాగా అభివర్ణించారు. కానీ ఇది ప్రేక్షకులకు భయం కలిగించే సినిమా కాదు, కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్ మరియు తర్కం లేని సినిమాలతో కెరీర్ నిర్మించుకున్న ఫిల్మ్ మేకర్ల గుండెల్లో వణుకు పుట్టించే సినిమా అని ఆయన పేర్కొన్నారు. బుర్రను ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలని చెప్పే కాలం చెల్లిన దర్శకులకు ఈ చిత్రం ఒక పీడకల అని వర్మ విశ్లేషించారు.
హీరోలకు చరమగీతం
రణవీర్ సింగ్ తన నటనతో, ఇన్నాళ్లూ గాయపడకుండా, నొప్పి తెలియకుండా, కేవలం ఎలివేషన్ల మీద బతికే ‘దేవుళ్ల’ లాంటి హీరోలను ఖననం చేశారని వర్మ అన్నారు. ఇందులో హీరో బలహీనతలు కలిగి ఉండి, నిజమైన రక్తం చిందిస్తూ, తన మేధస్సుతో హీరోయిజం పండించడం చూస్తుంటే.. పాతకాలపు హీరోలు సర్కస్లో క్లౌన్స్లా కనిపిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్లు, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీక్వెన్స్లను నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదని స్పష్టం చేశారు.
బాక్సాఫీస్ వద్ద శవయాత్ర
పాన్ ఇండియా దర్శకులు కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్ మరియు ఫోటోషాప్ చేసిన సిక్స్ ప్యాక్లతో క్యారెక్టర్లను సృష్టించవచ్చని భ్రమపడుతున్నారని, కానీ ఆదిత్య ధర్ మాత్రం ‘మెదడు’తో సినిమా తీసి చూపించారని వర్మ కొనియాడారు. ‘ధురంధర్ 2’ సాధిస్తున్న భారీ కలెక్షన్లు, పాతకాలపు మేకర్ల నమ్మకాలను పూడ్చిపెడుతున్న శబ్దాలని ఆయన అభివర్ణించారు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే దర్శకులు, ఇప్పటికైనా ‘ధురంధర్ 2’ను పదే పదే చూసి పాఠాలు నేర్చుకోవాలని ఆర్జీవీ సూచించారు. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు. డబ్బు ఉండొచ్చు కానీ, ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడి నుండి తెస్తారని ఆయన ప్రశ్నించడం సినిమా వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.