తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ను పొడిగిస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం గతంలో ప్రకటించినట్లుగానే, తాముకూడా అప్పటి వరకు కొనసాగిస్తామని సీఎం అన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 59 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాని కేసీఆర్ చెప్పారు. 20 వేల మంది క్వారంటైన్లో ఉన్నారని, ఇవాళ ఒక్కరోజే 10 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందిస్తున్నారని చెప్పారు. లాక్డౌన్ చేయకపోతే అందరి జీవితాలు ప్రమాదంలో పడేవని సీఎం అన్నారు. ప్రపంచంలో ఇప్పటి వరకు కరోనాకు మందు లేదని, వ్యాప్తిని నిరోధించడమే కరోనాకు పెద్ద మందని కేసీఆర్ అన్నారు. అమెరికా వంటి దేశానికే వెంటిలేటర్ల కొరత వచ్చిందని, సామాజిక దూరం పాటించడం తప్ప మనకు గత్యంతరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అమెరికా, చైనా, ఇటలీ స్థాయిలో ఇండియాలో వ్యాపిస్తే 20 కోట్ల మంది కరోనా బారిన పడతారని నిపుణులు అంటున్నారని సీఎం తెలిపారు. స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని, ఇళ్లలోంచి ఎవరూ బయటికి రావొద్దని కేసీఆర్ చెప్పారు.